Baireddy Rajasekhar Reddy: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశాలను ప్రజల ముందు బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ వైసీపీ నేతలు గొంతెత్తుతున్నారని, అయితే వాస్తవానికి రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ గణనీయంగా ఏమీ చేయలేదని బైరెడ్డి విమర్శించారు. బడ్జెట్ పరిమితులు ఉన్న రోజుల్లోనే రాయలసీమలో ఎన్నో కీలక ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్మించిందని గుర్తు చేశారు.
Read Also: Melinda Gates: ఎప్స్టీన్ ఫైల్ వల్లే బిల్గేట్స్తో విడిపోయా.. మాజీ భార్య మిలిందా వెల్లడి
వైసీపీ నేతలకు ప్రాజెక్టులపై సరైన అవగాహన లేదని, కానీ తిట్లు మాట్లాడడంలో మాత్రం వారు నైపుణ్యం సంపాదించారని ఎద్దేవా చేశారు బైరెడ్డి.. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఏ ప్రాతిపదికన ప్రారంభించారో వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లిఫ్ట్ ప్రాజెక్టుపై ఇప్పటివరకు సుమారు రూ. 850 కోట్లు ఖర్చు చేశారని, అయినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము కాలువలో కొట్టుకుపోయిందని ఆరోపించారు. రైతులకు నీరు అందించడానికన్నా కాంట్రాక్టర్ల కడుపు నింపేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టారన్నారు. రాయలసీమ లిఫ్ట్ వెనుక స్పష్టమైన హిడన్ ఎజెండా ఉందని ఆరోపించిన బైరెడ్డి, దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ప్రజల సమక్షంలో చర్చ జరపాలని వైసీపీ నేతలను ఆయన సవాల్ చేశారు.