పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్రనాయకత్వం ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తనని సస్పెండ్ చేసినట్లు సమాచారం అందిందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. 12ఏళ్ల వయసు నుంచే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది.. నేను రాజకీయాల్లోకి వచ్చే సమయానికి టీడీపీ లేదు.. కేవలం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే వున్నాయన్నారు.
NTR అంటే వున్న అభిమానంతో టీడీపీలో చేరాను. క్రమ శిక్షణ సంఘం ఇచ్చిన సమాచారంతో సీఎం జగన్ ఏకీభవించారు.. అది సరైన పద్ధతి కాదు. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన అది ఇండిపెండెంట్ గా గెలిచినట్టే లెక్క. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసినపుడు ఇప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వ్యతిరేకంగా పని చేశారు. 2019 ఎన్నికల్లో ప్రసాద రాజును గెలిపించేందుకు చాలా కృషి చేశానన్నారు కొత్తపల్లి.
ఏ పార్టీలో వున్నా క్రమశిక్షణగా పని చేశా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం వున్నవారికి, వైసీపీ పెట్టినపుడు వున్న నిజమైన కార్యకర్తలకు. న్యాయం జరగట్లేదు. అభివృద్ది కోసం ప్రశ్నిస్తుంటే నా రాజకీయ జీవితంలో కొమ్ములు తిరిగిన ముఖ్యమంత్రులను చూసాను. అభివృద్ధి కోసం ఎక్కడ రాజీ పడలేదు. నర్సాపురం అభివృద్ది నాతోనే సాధ్యం అయ్యింది. పార్టీ కేంద్రకార్యాలయం నుంచి నన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఇచ్చిన లెటర్ పై ఎవ్వరి సంతకం లేదు.
వైసీపీ పార్టీ కి ఎక్కడ అన్యాయం చేశానో ఎమ్మెల్యే ప్రసాద రాజు చెప్పాలి. తనపై ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలి. వైసీపీకి సాయం చేశాను తప్ప ద్రోహం చేయలేదు. క్రమ శిక్షణ సంఘం ఏం చూసి తనని సస్పెండ్ చేశారో చెప్పాలి. క్రమ శిక్షణ సంఘం తనని ఎందుకు సంప్రదించలేదు. పార్టీ నియమావళి లో తప్పు చేసిన వారి విషయం చర్చించే రూల్ వుందా లేదా? దున్న ఈనిందంటే దూడని కట్టెయ్యమన్నట్టు క్రమ శిక్షణ సంఘం వ్యవహరించింది. తన ప్రతిష్ట దెబ్బ తినే విధంగా వ్యవహరించారు. ఎవరు తనపై ఫిర్యాదు చేశారో సాయంత్రం లోగా చెప్పాలని కోరారు. చేసిన తప్పును వివరిస్తూ లెటర్ హెడ్ పై వివరిస్తూ ప్రకటన చేయాలన్నారు కొత్త పల్లి సుబ్బారాయుడు.
తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఎందుకు తీసుకోవడంలేదు. ఆయన పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? సీఎం జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి నేను ఎమ్మెల్యేగా పని చేశా. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి విజయం సాధిస్తా అన్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు.
CM Jagan: వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్