గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామ పరిధిలో నేడు జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ జరగనుంది. ఈ సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరై ప్రసంగించనున్నారు. సభకు హాజరయ్యే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాగా 2024 ఎన్నికలకు జనసేన ఎలా ముందుకెళ్తుంది, ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు అనే అంశాలపై ఈరోజు నిర్వహించే సభలో పవన్ కళ్యాణ్ వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సభకు హాజరయ్యే వారికి జనసేన పార్టీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. టోల్ ప్లాజా సిబ్బందితో వివాదం పెట్టుకోవద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు, మద్యం సేవించి వాహనం నడపొద్దు, ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు తీసి రోడ్లపై నడిపించవద్దు, సభా స్థలిలో శాంతంగా ఉంటూ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలి, చెట్లు, గోడలు, టవర్లు, స్పీకర్లపైకి ఎక్కకూడదు, విద్యుత్తు స్తంభాలకు దూరంగా ఉండాలి, పోలీసులు, అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి అంటూ జనసేన పార్టీ సూచించింది.
