NTV Telugu Site icon

మాకు ప్రజా బలం ఉంది, పోలీసులు అవసరం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

కడపజిల్లా బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వ చీఫ్‌ విప్ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని, తమకు ప్రజా బలం ఉందని, పోలీసులు అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితమై పోయిందన్నారు. ప్రభుత్వం పై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.

ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇది చెయ్యలేదని ప్రశ్నించలేని పరిస్థితి ప్రతిపక్షాలదని ఆయన అన్నారు. సోమశిల నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు శ్రీకాంత్ రెడ్డి.. ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్ ది అని. సోమశిల విషయంలో పెండింగ్‌లో ఉన్న 19 వేల అప్లికేషన్లలో అర్హులైన అందరికి వన్‌ టైం సెటిల్ మెంట్ చేస్తామన్నారు.

నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నామని, ఎన్నికల కమిషన్‌ను మేము కూడా అడుగుతామని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు మందిమార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. పారా మిలటరీ బలగాలతో హడావుడి చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. మొత్తం ఆర్మీ బలగాలు దించినా ఏం కాదన్నారు. కాంగ్రెస్ , బీజేపీ కలయికతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు.

మాకు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని విభజన చట్టంలోని ఉన్న హామీలనే అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, దుగరాజపట్నం , స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధరలు ఎందుకు పెంచుతున్నారు.. ఎందుకు మాట్లాడడం లేదు. వ్యక్తిగతంగా దూషణలు, ఆరోపణలు చేయడం సంస్కారం కాదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని చెప్పారు.

ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు కేవలం కేంద్రంలో పదవి కోసమేనని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ భిక్ష పెట్టినవారిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డిపాజిట్లు రావని తెలిసి ప్రచారం వదిలేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉనికి కాపాడుకోవడం కోసం ఆరాట పడుతున్నారు. ప్రజల్లోకి తిరిగి ఓట్లు అడగండి. ప్రెస్‌ మీట్లకు పరిమితమై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. టీడీపీ ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడ్డం అనవసరం. మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత వంగి వంగి దండాలు పెట్టారన్నారు. ఏదో రకంగా ప్రచారం కావాలని టీడీపీ కోరుకుంటుందని చంద్రబాబు గురించి అందరికి తెలుసునని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.