తమ పాఠశాల అంటే వారికెంతో అభిమానం..తమకు విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలను వేరేచోటికి తరలించడాన్ని వారు నిరసించారు. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి మాయదార్లపల్లి విద్యార్థులు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. మా పాఠశాల మాకే కావాలి.మాకు చదువును దూరం చెయ్యవద్దు అంటూ వేడుకున్నారు. గత 45 రోజులుగా పోరాటం చేస్తున్న విద్యార్థులు.. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి గ్రామం మారుమూల ప్రాంతం. ఎక్కడో విసిరి వేయబడ్డట్లు ఉన్న కర్ణాటక బార్డర్ లో చిట్ట చివరి గ్రామాలైన ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోని కనీసం మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేని గ్రామం మాయదార్లపల్లి గ్రామం. అలాంటి గ్రామంలో గత 45 రోజులుగా ఆ విద్యార్థులను బసాపురం స్కూల్ నందు విలీనం చేయటాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బడి బయట ఉన్నాం అయినా కూడా మమ్ములను పట్టించుకున్న నాథుడు లేడని వారు తమ గోడును వెళ్ళబోసుకున్నారు.
Read Also: God Father Teaser: కాపీ చేసి మళ్లీ దొరికిపోయిన తమన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
చివరికి పెద్దల సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి ,ప్రధాన న్యాయస్థానం, నేలపాడు అమరావతి- పిన్ 522 237 అను అడ్రస్ కు పోస్ట్ కార్డు ద్వారా లేఖలు రాశారు..
గౌరవనీయులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివ్య సన్నిధానానికి నమస్కరించి వ్రాయునది ఏమనగా?
సార్! నేను అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలోని 6,7,8, తరగతులను బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. కాని మేము మా ఊరి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో కుంట అను ప్రాంతంలో మా పెద్దలు అక్కడే నివసిస్తున్నారు. మేము అక్కడి నుండి పాఠశాలకు చేరుకోవడానికి నాలుగు కిలోమీటర్లు వంకలు వాగలు చెట్ల వెంబడి పుట్ల వెంబడి నడుచుకుంటూ మాయదార్లపల్లి పాఠశాలకు చేరుకుంటున్నాము. మా తరగతులను బసాపురం గ్రామంలో ఉన్న పాఠశాలకు విలీనం చేయడంతో మేము మరల మాయదార్లపల్లి గ్రామం నుండి మరో మూడు కిలోమీటర్లు నడిచి బసాపురం గ్రామంలోని పాఠశాలకు చేరుకోవాలంటే చాలా కష్టం.
అందుకనే మా ఇంట్లో ని పెద్దలు మా చదువులు మధ్యలోని ఆపు చేయించి మమ్ములను మా తోటి విద్యార్థులను బడి మానివేయించి మా పొలాల్లోని పనులకు మా పశువులను గొర్రెలను మేపడానికి మమ్ములను సిద్ధం చేస్తున్నారు. కావున దయగల మహాప్రభువులు మా పాఠశాల తరగతులను మా ఊరిలోనే నిర్వహించే విధంగా చేస్తే బాగా చదువుకుంటాం. లేదంటే మా తల్లిదండ్రులు మమ్ములను ఎటు పనికి రాకుండా పశువుల కాపర్లుగా గొర్రెల కాపర్లుగా తదితర పనులకు పెట్టబోతున్నారు. అంతేకాకుండా మా పాఠశాల నాడు నేడు పనులన్నీ పూర్తి కాబడి సుందరంగా రూపురేఖలు తిద్దుకుంది. కావున తమరు పెద్ద మనసుతో మా పాఠశాల తరగతులను బసాపురం గ్రామంలో విలీనం చేయకుండా …మా చదువులు మధ్యలో ఆగిపోకుండా మమ్మల్ని ఎలాగైనా కాపాడాలని మిమ్ములను వేడుకుంటున్నాము.
అంటూ పోస్ట్ కార్డు ద్వారా ఈరోజు ఉత్తరాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాసుకున్నారు. మరి ప్రధాన న్యాయమూర్తి ఈ చిన్నారుల విన్నపానికి ఎలా స్పందిస్తారో చూద్దాం.