తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Rains

మూడు రోజుల క్రితం వరకు తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. అయితే రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 15న ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణశాఖ.

ఏపీలో మళ్లీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 4 రోజులు పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉండటంతో సముద్ర తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముందని చెప్పింది వాతవారణశాఖ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో భారీ వర్షాలు.. ఇవాళ, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.