Site icon NTV Telugu

Breaking : ఏపీలో మరో దారుణం.. బాలికపై కరస్పాండెంట్‌ అత్యాచారం..

Girl

Girl

ఏపీలో పరిస్థితులు రోజురోజుకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అత్యాచార ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ఇటు ప్రభుత్వం, అటు పోలీసు శాఖ మృగాళ్లను కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోతోంది. పాఠశాలలకు పంపితే పాఠశాలలోని ఉపాధ్యాయులే విద్యార్థినులపై అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం శోచనీయం. అయితే తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నగరానికి చెందిన బాధిత బాలిక ఆరో తరగతి నుంచి కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది.

అయితే.. తండ్రి చనిపోవడంతో తల్లే ఆమెను చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో.. ఇటీవలే తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన బాలికపై వసతిగృహం కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్ (60) కన్నేశాడు. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి ఈ ఏప్రిల్‌లో తన గదికి తీసుకెళ్లిన నిందితుడు విజయకుమార్ కరోనా మాత్రలంటూ బాలికకు కొన్ని మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక బాలిక మత్తులోకి జారుకుని నిద్రపోయింది. ఇదే అదునుగా భావించిన దుర్మార్గుడు విజయ కుమార్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్న బాలిక మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.

అంతేకాకుండా.. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధిత బాలిక కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆమెకు గర్భస్రావం అయినట్టు వైద్యులు తెలిపారు. విజయకుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు విజయ కుమార్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Exit mobile version