11వ పీఆర్సీపై ఏపీలో మళ్లీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన పీఆర్సీపై విముఖత ఉన్న ఉద్యోగ సంఘాలు.. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడుతామని ప్రకటించాయి. మరోమారు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. సీఎంఓ అధికారులతో చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ లు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ రెండు సంఘాలు కలిసి పోరాడటానికి నిర్ణయించిన నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని మరోసారి సీఎంవో అధికారులను ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. అయితే గతంలో కూడా ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు జరుపుతున్న చర్చలు ఫలిస్తాయా..? అని కొందరు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.