బిగ్ వ్యాక్సినేషన్ డేను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపు ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా కనీసం 8 లక్షల నుంచి 10 లక్షల వరకు వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయం తీసుకుంది.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా. గీతా ప్రసాదిని.. రేపు ఒక్క రోజే ఒక్కో జిల్లాలో లక్ష మందికి వ్యాక్సిన్ వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.. కనీసం 8 నుంచి 10 లక్షల డోసుల వరకు వేయగలుగుతామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఉదయం 7 గంటలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు..
45 ఏళ్ళు పైబడిన వారికి, 5 ఏళ్ళలోపు పిల్లలు ఉన్న తల్లులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు డాక్టర్ గీతా ప్రసాదిని.. రాష్ట్రవ్యాప్తంగా 1,149 పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, అవసరమైన చోట్ల గ్రామ సచివాలయాల్లో కూడా వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు.. వ్యాక్సిన్ సెంటర్ల ఏర్పాట్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారుని తెలిపారు.. విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణ, గుంటూరు, అనంతపురంలో ఒక్కో జిల్లాలో లక్ష కోవిషీల్డ్, 5 వేలు కోవాక్సిన్ నిల్వలు ఉన్నయన్న ఆమె.. మిగిలిన జిల్లాల్లో 55 నుంచి 60 వేల వరకు డోసులు అందుబాటులో ఉంచామని.. కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తు వ్యాక్సినేషన్ జరుగుతున్నట్టు వెల్లడించారు.. ఇక, 18.43 లక్షల మంది చిన్నపిల్లల్ల తల్లుల్లో ఇప్పటికే 5 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని.. మిగిలిన వారందరికీ రేపు వ్యాక్సిన్ వేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా. గీతా ప్రసాదిని.