తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్లో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూసిన ఈ జిల్లాల్లో తగ్గినట్టే తగ్గి.. పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. దీంతో.. కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. మరికొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.. కోవిడ్ కేసులు కారణంగా రాజమండ్రి ఆదర్శనగర్లో రెండు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు అధికారులు.. కోవిడ్ కేసుల కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేయాలని కమిషనర్ కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో జరిగే ప్రతీ కార్యక్రమానికి కార్పొరేషన్ లో దరఖాస్తు, అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు..
ఇక, దుకాణాలు, షాపింగ్ మాల్స్ వద్ద ప్రజలు గుమిగూడితే యజమానులకు నోటీసులు జారీ చేయనున్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.. కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలను 2007 విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం మూసివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. రాజోలు మండలంలో రేపటి నుంచి కరోనా కట్టడి ఆంక్షలు అమలు చేయనున్నారు.. సాయంత్రం 5 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుందని.. కరోనా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రాజోలు తహసీల్దార్ ముక్తేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.