స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ఆరా తీసిన ఆయన.. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.. విద్యాకానుకలో భాగంగా ఇవ్వనున్న స్పోర్ట్స్ డ్రస్, షూలను పరిశీలించి.. వాటికి కొన్ని సూచనలు చేశారు.. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు అధికారులు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ప్రధాన ఉద్దేశం అన్నారు.. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొలి విడతలో 15 వేలకు పైగా స్కూళ్లు తీర్చిదిద్దాం.. అమ్మ ఒడి పథకం అమలు ఉత్తర్వుల్లో 75శాతం హాజరు ఉంచాలన్న నిబంధన పెట్టామని.. కోవిడ్ పరిస్థితులు కారణంగా ఆ నిబంధనలను అమలు చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు.
ఇక, 2022 నుంచి అమ్మ ఒడి పథకానికి హాజరుకు అనుసంధానం చేయాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. అకడమిక్ ఇయర్తో అమ్మ ఒడి అనుసంధానం కావాలన్న ఆయన.. 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది అమల్లోకి తీసుకుని రావాలన్నారు. అన్ని స్కూళ్లకూ సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని.. 2024 నాటికి పిల్లలు సీబీఎస్ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని, ప్రతి హైస్కూల్కు కచ్చితంగా ప్లే గ్రౌండ్ఉండాలని.. మ్యాపింగ్చేసి.. ప్లే గ్రౌండ్ లేని చోట భూ సేకరణ చేసి ప్లే గ్రౌండ్ను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలని. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.. ప్రతి స్కూల్కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.1 లక్షను వారికి అందుబాటులో ఉంచాలని సూచించిన ఏపీ సీఎం.. ఎలాంటి సంస్కరణలు, మార్పులు తీసుకు రావాలనుకున్నా దాని వెనుకున్న ఉద్దేశ్యాలను టీచర్లకు స్పష్టంగా చెప్పాలన్నారు.. టీచర్ల మ్యాపింగ్ను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధించే విధానాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలన్న ఆయన.. ఎయిడెడ్ స్కూళ్లను ఎవ్వరూ బలవంతం చేయడంలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ఎయిడెడ్ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుందన్న ఆయన.. లేదా వాళ్లు నడపాలనుకుంటే వారే నడుపుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. పాఠ్యప్రణాళికను మెరుగు పరిచే అంశంపై తర్వాతి సమావేశంలో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.