CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు, అధికారులతో సచివాలయంలో వరుసగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీపై ఏపీ సీఎం సంకేతాలు ఇచ్చారు. టీడీపీ హయాంలోని ఇసుక పాలసీకి.. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడాను అధికారులు వివరించారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబుకు తెలిపారు. అయితే, గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుందని అధికారులు వెల్లడించారు.
Read Also: Crime News: భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. దంపతుల ప్లాన్ మూములుగా లేదుగా
అలాగే, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో చాలా ఇబ్బందులు వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఇక, ధరల తగ్గింపుపై ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానం తెస్తామని, ధరలను తగ్గిస్తామని ఎన్నిక ప్రచారంల్లో సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడాలి.. జనం ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలే కాదు.. దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి.. రోడ్ల మరమ్మత్తులపై ఫోకస్ పెట్టాలి.. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలి.. తక్షణం నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.