CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురోగతి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరియు కూటమి ప్రభుత్వ విజన్పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వంపై ఉంచిన నమ్మకంతోనే రైతులు రాజధాని అమరావతి కోసం తమ భూములను త్యాగం చేశారని గుర్తుచేశారు. అయితే, గత పాలకుల హయాంలో ప్రజావేదికను కూల్చివేయడమే కాకుండా, పెట్టుబడులను తరిమేస్తూ రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఆ అరాచక పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్కు రావడానికి పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని, కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ‘ఏపీ బ్రాండ్’ను పునరుద్ధరించి పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించామని చంద్రబాబు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ పాలనలో జరిగిన రూ.10 లక్షల కోట్ల అపారమైన అప్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా దివాలా తీసే స్థితికి చేరుకుందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల కోసం గతంలో ఏ కేంద్రమంత్రి దగ్గరకు వెళ్లినా తిరిగి మన చేతికే కాగితాలు ఇచ్చేంతగా వ్యవస్థలు ధ్వంసమయ్యాయని చెప్పారు. వెంటిలేటర్పై ఉన్న అటువంటి ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆక్సిజన్ అందించి కాపాడుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ అప్పులన్నింటినీ రీషెడ్యూలు చేస్తూ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నామని, అలాగే రూ.12 వేల కోట్లతో కేంద్ర పథకాలను మళ్లీ పునరుద్ధరించామని వెల్లడించారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లను తిరిగి నిలబెట్టేందుకు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని చంద్రబాబు వివరించారు.
గతంలో పరదాల చాటున సాగిన పాలనకు భిన్నంగా, ఇప్పుడు ప్రజల మధ్యే ఉంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తున్నామని సీఎం అన్నారు. క్యాబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ మీటింగ్లు, కలెక్టర్ల సదస్సులు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కోసం క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తనిఖీ చేస్తున్నామని, “సీఎం అంటే కామన్ మ్యాన్” అనే నినాదంతోనే తమ పాలన సాగుతోందని చెప్పారు. “సమాజమే దేవాలయం.. పేదలే దేవుళ్లు” అన్న ఎన్టీఆర్ ఆశయాన్ని తాము శిరోధార్యంగా భావిస్తున్నామన్నారు. కేవలం అప్పులు చేసి సంక్షేమం అందించడం కాకుండా, సంపద సృష్టించి సంక్షేమాన్ని పంచడమే టీడీపీ లక్ష్యమని, అందులో భాగంగానే మొదటి తేదీనే పెన్షన్, స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం 2.0 వంటి పథకాలను సమర్థవంతంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని చెప్పడానికి గూగుల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థ, ఆర్సెలార్ మిట్టల్ వంటి అంతర్జాతీయ పరిశ్రమలు ఏపీకి రావడమే నిదర్శనమని చంద్రబాబు సగర్వంగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగామని, దీని ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. దేశంలోకి వస్తున్న మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (FDI) ఒక్క ఆంధ్రప్రదేశ్కే 25 శాతం రావడం విశేషమన్నారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించి సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ ఇలా అన్నిటికీ ముందే తేదీలు ఖరారు చేసుకుని ఒప్పందాలు చేసుకుంటున్నామని, కేవలం 36 రోజుల్లోనే 5వ తరం ఫైటర్ జెట్ తయారీ మరియు టెస్టింగ్ ప్రాజెక్టు ఏపీకి రావడం ఇక్కడి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు అద్దం పడుతోందని కొనియాడారు.
రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను పూర్తిగా తగ్గించి, ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఆశయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ‘ఎంబీకే 10-20’ (MBK 10-20) కార్యక్రమం ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తిని (GSDP) రూ.17 లక్షల కోట్ల నుంచి గణనీయంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 2047 నాటికి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలవాలని, ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలనే సుదూర లక్ష్యంతో తాము రూపొందించిన ‘పది సూత్రాల విజన్’ ద్వారా ఒక్కో మెట్టూ పైకి ఎదుగుతామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
