అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం మదనపల్లి-రాయచోటి ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మృతులు పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మదనపల్లి నుంచి స్వగ్రామం కలిచెర్లకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఠాణామిట్ట వద్ద వర్షంలో రోడ్డును క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. లారీ ఢీకొట్టడంతో బైక్పై వెళుతున్న నలుగురిలో ముగ్గురు మృతి చెందినట్లు వివరించారు. కాగా ఈ ఘటనలో బైక్ నుజ్జునుజ్జు అయ్యింది. మృతదేహాలు కూడా రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.