తిరుమల ఘాట్ రోడ్డు పై ఈ మధ్య వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు.. ఇక తాజాగా ఒకే రోజు రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ టెంపో వాహనం తిరుమల నుంచి మొదటి ఘాట్ రోడ్ ద్వారా తిరుపతికి వస్తుండగా ఆరో మలుపు వద్ద రెయిలింగ్ వాల్ ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటన లో 12 మందికి గాయాలయ్యాయి. వారిని కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన భక్తులుగా గుర్తించారు. క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు..
తీవ్రంగా గాయాలు కావడంతో వారిని మెరుగైన వైద్యం కోసం బర్డ్ హాస్పిటల్ కు తరలించారు..అలాగే మరో ప్రమాదంలో తిరుమల కొండపైకి వస్తున్న కారు రెండో ఘాట్ రోడ్డులో ఆర్చిని ఢీకొట్టింది. ఈ ఘటన లో తెలంగాణకు చెందిన ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.. వారిని కూడా రుయా ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుంది..
తిరుమల ఘాట్ రోడ్లపై తాజా ప్రమాదాల నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. వరుస ప్రమాదాలపై నివేదిక రూపొందించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఘటనలపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.. ప్రస్తుతం ఈ ప్రమాదాలలో గాయపడిన వారంతా క్షేమంగా ఉన్నారని సమాచారం..