పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. అయితే, మేం ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఈ ఫలితాలు అంటోంది తెలుగుదేశం పార్టీ.. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.. కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని సూచించారు.. కోర్టుల ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారని విమర్శించిన ఆయన.. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు.
ఇకనైనా చంద్రబాబు, కుట్రలు, కుతంత్రాలు మానుకోవాలని సూచించారు వైసీపీ ఎంపీ రెడ్డప్ప.. ఎన్నికల్లో ఓటమి భయంతో ఎన్నికల బహిష్కరణ నాటకం మొదలు పెట్టారని ఎద్దేవా చేసిన ఆయన.. తెలుగుదేశం పార్టీ నాయకులకు సిగ్గు శరం లేదని మండిపడ్డారు.. ఎన్నికలను బహిష్కరించినవాళ్లు బీ ఫాంతో నామినేషన్ ఎలా వేశారు అని ప్రశ్నించారు.. ఇక, సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాల వల్లే భారీ విజయం సాధించామని స్పష్టం చేసిన రెడ్డప్ప.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం.. వైఎస్ జగన్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు.