వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పంలోని శాంతిపురం మండలానికి చేరుకున్న ఆయన.. మరోసారి సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్లు.. జగన్ కూడా తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం జగన్ చివరి తప్పు అవుతుందని, మీటర్లు పెట్టకుండా రైతులు ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. లేకపోతే.. ఈ మీటర్లు రైతుల పాలిట ఊరితాళ్ళు అవుతాయని ఆగ్రహించారు.
ఆంధ్రప్రదేశ్ను మరో శ్రీలంక కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. నాడు రావణుడు చేసిన తప్పుకు లంక దహనమైందని చెప్పిన ఆయన.. జనం మేలుకోకపోతే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తుందని విమర్శించారు. గడప గడపకు వచ్చే ప్రతీ వైసీపీ ప్రజా ప్రతినిధులను సమస్యలపై నిలదీయమని ప్రజల్ని కోరారు. ఆదర్శ నియోజకవర్గమైన కుప్పంలోనూ ధన రాజకీయాలు చేస్తున్నారని, 1000 రూపాయలు ఇచ్చి లక్ష దోచేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో చేపలకు ఎర వేసినట్లు.. జగన్ ప్రజలకు ఎర వేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.