ఏపీకి జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తిచేయాలని, అంచనా వ్యయాన్ని ఆమోదించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రెండున్నర గంటలపాటు కొనసాగిన సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని విజయసాయి రెడ్డి తెలిపారు.
గత పర్యటన సందర్బంగా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రం లోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించాం. పరిష్కార మార్గాలను అన్వేషించాం. సమావేశం చాలా సానుకూలంగా జరిగింది. త్వరలోనే కేంద్రం నుంచి మంచి సమాచారం వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దీనికి కొనసాగింపుగా , సంబంధిత రాష్ట్ర అధికారులు నిరంతరం సంప్రదింపులు చేస్తారు. పెండింగ్ అంశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తారు. పోలవరం సవరించిన అంచనాలను యధావిధిగా ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చాం అన్నారు విజయసాయి.
పోలవరం పునరావాసంతో సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగాయన్నారు. రెవెన్యూ లోటు పై చర్చించాం. బడ్జెట్ సమయంలో బిజీగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండున్నర గంటల సమయం ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన వినతి పత్రం, ప్రధాని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ సమావేశం నిదర్శనం అన్నారు విజయసాయిరెడ్డి.