ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదనపు అప్పు పొందేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు గానూ ఆంధ్రప్రదేశ్తో పాటు రాజస్థాన్కు కూడా అదనపు అప్పుల పరిమితి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.7,309 కోట్ల అదనపు అప్పులు తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.. ఇందులో ఆంధ్రప్రదేశ్కు రూ.2,123 కోట్లు, రాజస్థాన్కు రూ.5,186 కోట్లు అదనపు అప్పుల పరిమితి పెంచుతున్నట్లు పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో ఈ పరిమితి పెంపు ఆ రాష్ట్రాలకు శుభవార్త అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.. మరోవైపు, విద్యుత్ రంగ సంస్కరణలు అమలు చేసిన తమకు కూడా ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశం కల్పించాలని ప్రతిపాదనలు పంపాయి 9 రాష్ట్రాలు.