జల్లయ్య హత్యను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఖండించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యుల పరామర్శించేందుకు పల్నాడుకు బుద్దా వెంకన్న బయలు దేరడంతో.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో బుద్దా వెంకన్నని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుందని, హత్యలు చేయమని సీఎం ప్రొత్సహిస్తున్నారన ఆయన ఆరోపించారు. అందుకే వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవడం లేదని, పల్నాడులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను చంపేశారన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ హత్యల వెనుక సూత్రధారి అని మండిపడ్డా వెంకన్న.. పిన్నెల్లిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జల్లయ్య మృతదేహానికి నివాళి అర్పించడానికి మేము వెళ్లకుడదా..? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దల చెప్పు చేతల్లో నడుస్తున్నారని, డీజీపీ కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాలను పాటిస్తున్నారన్నారు. మూడేళ్లు సవాంగ్ను వాడుకుని పంపేశారని, ప్రస్తుత డీజీపీ పరిస్థితి కూడా అంతే అనేది తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. జగన్.. ఎవరినైనా యూజ్ అండ్ త్రో గానే చూస్తారని, రాజకీయంగా ఎదుర్కోలేక.. జగన్ హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టి బుద్ధి చెప్పాలన్నారు.