ఏపీలోని పోలీస్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తోందంటూ స్పష్టీకరణ చేసారు. ఏపీ పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపుతో చూస్తోంది. త్వరలోనే ఏపీలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోంది. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలి. పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదు.. అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుంది అన్నారు.
ఇక కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశాం. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయి. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. అవినీతి కార్యక్రమాలపై ఈ నెల 28వ తేదీన బీజేపీ సభ నిర్వహిస్తోంది. తొలిసారి సీఎం అయ్యారు కాబట్టి.. నెమ్మదిగా అర్ధం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి చూసింది. ఏపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని అవలంభిస్తోంది. రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బ తిన్నాయి. ఇసుక అందుబాటులో లేదు.. సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతోంది అని తెలిపారు.
అలాగే సినిమా రేట్లపై ఈ ప్రభుత్వానికి ఉన్న ఇంటరెస్ట్.. ప్రజా సమస్యలపై ఎందుకు లేదు. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై థియేటర్ యజమానులు కోర్టుకెళ్తే.. హాళ్లను సీజ్ చేయిస్తారా అని అడిగారు. పొరుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు ఎంతున్నాయి..? అక్కడి విధానం ఏంటో ఓసారి చూడండి. ఎవరినో దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారా.. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. దశలవారీ మద్య నిషేధం కాదు.. దశలవారీ మద్యపాన వినియోగాన్ని జగన్ ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది. ఏపీలో జరిగే ప్రతి కార్యక్రమం కేంద్ర నిధులతోనే చేస్తున్నారు. గ్రామ సచివాలయాల నిర్మాణం కూడా కేంద్ర నిధులతోనే చేపట్టారు. గ్రామ సచివాలయాల నిర్మాణం బిల్లులు కూడా ఇవ్వలేదు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు.. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. రెండున్నరేళ్లల్లో స్టీల్ ఉత్పత్తి చేస్తామన్నారు.. ఏమైనా చేశారా అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.