అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆళ్లగడ్డలో ఇష్టం వచ్చినట్టుగా పన్నుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. అకౌంట్లలో నగదు వేస్తే ప్రజలు నోరు మూసుకుని ఉంటారని ప్రభుత్వం నీచమైన ఆలోచన చేస్తోందంటూ ఆరోపించారు.. ప్రభుత్వం మున్సిపాలిటీలను అ భివృద్ధి చేయకుండా పన్నులు మాత్రం విపరీతంగా పెంచుతోందని, ప్రజలపై భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోని షాపులకు ప్రభుత్వం మూడేళ్లకు 33 శాతం రేట్లు పెంచి జీవో జారీ చేసిందని.. కానీ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రభుత్వ జీవోను పక్కన పెట్టి ఏడాదికి 65 శాతం పెంచి కొత్త జీవోను జారీ చేశారని దుయ్యబట్టారు.. కొత్త జీవోలో వృత్తి, వ్యక్తులను బట్టి రేట్లు పెంచడం దుర్మార్గమైన విషయమన్న ఆమె.. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇక, ఆళ్లగడ్డలోని రూ. 3 కోట్ల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి కట్టలేక.. ఎమ్మెల్యే రేట్లు పెంచడం అన్యాయమన్న ఆమె.. సీఎం వైఎస్ జగన్ పేరు చెప్పుకొని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు భూమా అఖిల ప్రియ.