ఏపీలో ప్రస్తుతం పొత్తుల రాజకీయం హాట్ హాట్గా నడుస్తోంది. కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ మంత్రులు, కీలక నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనేక సంవత్సరాలు సీఎంగా పనిచేశారని, అయినప్పటికీ ఆయనకు సొంత పార్టీపై నమ్మకం లేదని బాలినేని విమర్శించారు. అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో కలిసినా, ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా జగన్ను ఏమీ చేయలేరని బాలినేని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబుకు పొత్తు కావాల్సిందేనని.. తాను గెలుస్తానో, లేదో అన్న అభద్రతాభావం చంద్రబాబులో ఉందన్నారు. కానీ జగన్ సొంతంగా పార్టీ పెట్టి, ఒక్కడే పోరాడి అధికారంలోకి వచ్చారని బాలినేని గుర్తు చేశారు. కానీ చంద్రబాబుకు ఆ ధైర్యం లేదని, ఇతర పార్టీల పొత్తు కోరినప్పుడే జగన్ను ఎదుర్కోలేక పోతున్నారన్న విషయం స్పష్టమవుతుందని బాలినేని అన్నారు. గత మూడేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని.. ప్రజలే తమ బలమని బాలినేని పేర్కొన్నారు.
Ambati Rambabu: జనసేన పార్టీని పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికా?