Dokka Seethamma Mid-Day Meal : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న ‘స్మార్ట్ కిచెన్స్’ (Smart Kitchens) విధానంపై కొందరు రాజకీయ స్వార్థంతో చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారాలన్నీ ముమ్మాటికీ అవాస్తవాలని, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర మాత్రమేనని మధ్యాహ్న భోజన పథకం విభాగం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యార్థుల శ్రేయస్సు, కార్మికుల ఉపాధి భద్రతపై ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది.
‘స్మార్ట్ కిచెన్స్’ లక్ష్యం విద్యార్థుల ఆరోగ్యమే.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు మరింత సమర్థవంతంగా, అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలనే ఏకైక సంకల్పంతోనే ప్రభుత్వం ‘స్మార్ట్ కిచెన్స్’ విధానాన్ని పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థుల ఆరోగ్య భద్రతను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, దీని వెనుక ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.
కార్మికుల తొలగింపు లేదు.. ఉపాధికి పూర్తి భద్రత
స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన వంట కార్మికులను తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా, ఒక్క కుక్ను కూడా తొలగించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చింది. దశాబ్దాలుగా పాఠశాలల్లో సేవలు అందిస్తున్న దాదాపు 85,000 (85 వేల) మంది అక్కచెల్లెమ్మల సేవలను ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని పేర్కొంది. వారి సంక్షేమానికి, ఉపాధి భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికుల పొట్ట గొట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి అస్సలు లేదని పునరుద్ఘాటించింది.
జీతాల బకాయిలపై స్పష్టత.. పాత బకాయిల విడుదల
మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు జీతాలు/గౌరవ వేతనాలను పూర్తిగా చెల్లించడం జరిగిందని ప్రభుత్వం వివరించింది. కేవలం సాంకేతిక కారణాల వల్ల నిలిచిన మిగిలిన స్వల్ప బకాయిలను కూడా త్వరితగతిన విడుదల చేయడానికి నిధులు సమకూర్చామని, అతి త్వరలోనే ఈ నిధులు నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపింది.
గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన దాదాపు రూ. 350 కోట్ల రూపాయల పైచిలుకు బకాయిలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా విడుదల చేసిందని గుర్తు చేసింది. ఈ నిధులలో పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, నైట్ వాచ్మెన్ల జీతాలతో పాటు, విద్యార్థులకు అందించే గుడ్లు, చిక్కీలు, శానిటరీ నాప్కిన్ల వెండర్లకు సుదీర్ఘకాలంగా ఇవ్వాల్సిన పాత బకాయిలు కూడా కలిసి ఉన్నాయని, దీనివల్ల లబ్ధిదారులందరికీ పెద్ద ఉపశమనం లభించిందని వివరించింది.
రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం వద్దు
విద్యార్థులకు మేలు చేసే సంస్కరణలను, కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే చర్యగా కొందరు చిత్రించడం శోచనీయమని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం రాజకీయ ఉనికి కోసం, ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించడానికి చేస్తున్న ఇలాంటి నిరాధార ఆరోపణలను ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చింది. విద్యార్థులకు సురక్షితమైన పోషకాహారం అందించడంతో పాటు, అటు మధ్యాహ్న భోజన కార్మికుల సంక్షేమాన్ని, వారి హక్కులను కాపాడటానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేస్తూ.. కార్మికులు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.

