ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు వేగంగా సాగుతోంది. రేపు లేదా ఎల్లుండి తుది నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చేరిన సుమారు 10-11 వేల వినతులు, అభ్యంతరాలు వచ్చాయి.
స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు చేర్పులకు అవకాశం వుండదని తెలుస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషనుకు.. తుది నోటిఫికేషనుకు పెద్దగా మార్పులు చేర్పులు ఉండవంటున్నారు అధికారులు. బాలాజీ జిల్లా పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది ప్రభుత్వం. బాలాజీ జిల్లాగా కాకుండా కొత్త జిల్లాను తిరుపతి పేరుతోనే ఏర్పాటు చేస్తూ నోటిఫికేషనులో సవరణ చేసే అవకాశం కనిపిస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో చెప్పిన 11 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో ఐదు డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం వుంది. ఇప్పటికే కొత్త జిల్లాల వారీగా కేడర్ ఎలాట్మెంట్ పూర్తయింది. కొత్త కలెక్టరేట్లల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల యంత్రాంగం ఫోకస్ పెట్టింది.