గంగవరం పోర్టులో క్రమంగా తన వాటాలను పెంచుకునే పనిలో పడిపోయింది అదానీ గ్రూప్.. తాజాగా, గంగవరం పోర్టులోని ప్రభుత్వ పెట్టుబడులను తమకు విక్రయించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.. అయితే, అదానీ గ్రూప్ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.. సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో ఎంపవర్డ్ కమిటీ వేసింది సర్కార్.. కమిటీలో సభ్యులుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ , న్యాయశాఖ కార్యదర్శి సునీత, ప్రభుత్వ రంగ సంస్థల కార్యదర్శి కెవీ రమణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉన్నారు.
కాగా, గంగవరం పోర్టులో ప్రభుత్వానికి 10.40 శాతం మేర వాటాలు ఉన్నాయి… ఒక్కో షేర్ ధర రూ. 120 చొప్పున అమ్మితే ప్రభుత్వానికి రూ. 645.1 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఇప్పటికే గంగవరం పోర్టులో తమకున్న 58.10, 31.50 శాతం మేర వాటాలను అదానీ గ్రూపునకు అమ్మేశారు డీవీఎస్ రాజు, విండీ లేక్ సైడ్.. ఇక, డీవీఎస్ రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ గ్రూపునకు బదిలీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఏపీ మారిటైమ్ బోర్డు సిఫార్సుల మేరకు గంగవరం పోర్టును అదానీ సెజ్ లో విలీనం చేసేందుకు అంగీకరించింది.. ఇప్పుడు ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీ.. గంగవరం పోర్టులో వాటాల బదిలీ, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణపై కూడా కసరత్తు చేయనుంది.