ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఉన్న నిధులు, కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న “అన్ రాక్” కంపెనీ ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించాను. ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్ ను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. న్యాయపరంగా కేసు పరిష్కారమైతే, ఒక పెద్ద కంపెనీ రాష్ట్రానికి వస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థల ఏర్పాటు గురించి కేంద్ర మంత్రితో చర్చించాను. వీటిని నెలకొల్పేందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు.
విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీలైనన్ని ఉండాలన్నది సీఎం జగన్ ఉద్దేశమన్నారు బుగ్గన. పోలవరం ప్రాజెక్టు అంశం, నిధుల విడుదలలో పురోగతి ఉంది. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం పాడైపోయిన పర్వాలేదనే తరహాలో టీడీపీ ఆలోచిస్తోంది. టీడీపీ దుర్మార్గానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అప్పులపై తెలుగుదేశం పార్టీ అనవసరపు రాద్ధాంతం చేస్తోంది. “కరోనా” కష్టకాలంలో పేదలను కాపాడడం కోసం అప్పులు తీసుకొచ్చాం. తెలుగుదేశం హయాంలో “కరోనా” లేనప్పటికీ అప్పులు చేశారు. “కరోనా” కారణంగా రాష్ట్రానికి పెరగాల్సిన ఆదాయం పడిపోయింది. అందుకే ఈ పరిస్థితుల్లో అప్పులు చేయక తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని, విశ్వసనీయతను దెబ్బతీసేలా టీడీపీ ప్రవర్తిస్తోంది. టీడీపీ ప్రవర్తన కారణంగా మొత్తంగా రాష్ట్రానికి నష్టం కలుగుతోంది’ మంత్రి బుగ్గన తెలిపారు.