నాగార్జున సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు విడుదల చేస్తోన్న తెలంగాణ తీరుపై ఏపీ అభ్యంతరం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ చేస్తోన్న నీటి విడుదలను అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి. లేఖలో ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ కోరారు. వేసవిలో తాగు నీటి అవసరాలకు లేకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని దుర్వినియోగం చేస్తోంది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం ముందస్తు అనుమతి లేకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని నిలువరించాలని ఆయన కోరారు.
ఎన్ఎస్పీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి నీరు భారీగా వచ్చేస్తోంది.ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 40.580 టీఎంసీలే.నాగార్జునసాగర్ నుంచి వదిలే నీటి ద్వారా పులిచింతల రిజర్వాయర్ నీటి మట్టం అసాధారణంగా పెరిగిపోతోంది.పులిచింతల ప్రాజెక్టుకు గత ఏడాది వచ్చిన వరద కారణంగా 16వ నెంబర్ గేటు కొట్టుకు పోయిన సంగతి తెలిసిందే.నీటి నిల్వ చేయలేక పూర్తిగా నీటిని సముద్రం పాలు చేయాల్సి వచ్చింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లో మరింతగా పెరిగితే పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసే అవకాశం వుండదంటున్నారు ఇరిగేషన్ అధికారులు.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయి నీటి నిల్వ ఉంది.ఇంకా నీటిని విడుదల చేస్తే.. ప్రకాశం బ్యారేజీతోపాటు పులిచింతల ప్రాజెక్టుకు ఇబ్బందులు కలిగేలా ఉంది.ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం మినహా మరోమార్గం లేదు.వేసవిలో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచుకోవాలి.అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందించాలంటే ఆ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి వినియోగాన్ని అడ్డుకోవాలి.తక్షణం విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ చేస్తోన్న నీటి వినియోగాన్ని నిలుపుదల చేసేలా ఉత్తర్వులివ్వాలని ఈఎన్సీ కేఆర్ఎంబీని కోరారు.