ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊతమిస్తూ రూ. 1,124 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇవాళ క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆ నిధులను విడుదల చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఎంఎస్ఎంఈలకు రూ. 440 కోట్లు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్కు రూ. 684 కోట్లు అందించనుంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు ఈ రంగాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు రూ. 2,086.42 కోట్లకు చేరనున్నాయి.. పారిశ్రామికాభివృద్దికి వెన్నెముకగా నిలుస్తూ రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్కు ఊతమిస్తూ ప్రోత్సాహకాలు విడుదల చేయనుంది ప్రభుత్వం.. గత ప్రభుత్వం 2015 నుంచి ఎంఎస్ఎంఈలకు బకాయి పెట్టిన రూ. 904 కోట్లు, స్పిన్నింగ్ మిల్స్కు బకాయి పెట్టిన రూ. 684 కోట్లు మొత్తం రూ. 1,588 కోట్లు బకాయిలు సైతం జగన్ ప్రభుత్వం చెల్లించిందని చెబుతున్నారు…
ఇక, రూ. 25,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించేలా కొప్పర్తిలో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ను 3,155 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్, నీరు, సీఈటీపీలు మరియు ఎస్టీపీల వంటి అత్యున్నత మౌలిక సదుపాయాలతో బహుళ ఉత్పత్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్గా ప్రభుత్వం అభివృద్ది చేస్తుంది. తద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం దొరకనుంది.. ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ. 10,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడానికి కొప్పర్తిలో రూ. 730.50 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ద్వారా 30,000 మందికి ఉపాధి లభించనుంది.. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న క్రియాశీలక చర్యలతో, రూ. 5,204.09 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన 16,311 ఎంఎస్ఎంఈలు అదనంగా 1,13,777 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో లబ్దిపొందుతున్న మొత్తం యూనిట్లలో 62 శాతం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులదే, ప్రోత్సాహకాలు పొందుతున్న యూనిట్లలో 42 శాతం అక్కచెల్లెమ్మలు ఉన్నారని గణాంకాలు చెబుతోంది సర్కార్.
వైఎస్సార్ నవోదయం కింద 1,08,292 ఎంఎస్ఎంఈల బ్యాంకు ఖాతాలకు చెందిన సుమారు రూ. 3,236.52 కోట్ల రుణాల రీ షెడ్యూల్… 2,49,591 ఎంఎస్ఎంఈల బ్యాంకు ఖాతాలకు అత్యవసర క్రెడిట్ లైన్ హమీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద రూ. 5,973 కోట్ల బ్యాంకు రుణాలతో అదనపు వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇవ్వనున్నారు.. వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రూ. 30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. దీని ద్వారా 46,119 మందికి ఉపాధి లబిస్తోంది. ఇదే కాకుండా రూ. 36,384 కోట్ల పెట్టబడితో త్వరలో ప్రారంభం కానున్న మరో 62 భారీ, మెగా ప్రాజెక్ట్లు 76,916 మందికి ఉపాధిని కల్పించనున్నాయి. దేశంలో తొలిసారిగా పారిశ్రామిక వేత్తల ఫీడ్ బ్యాక్ని కూడా తీసుకుని జరిపిన సర్వే ఆధారంగా, వరల్డ్ బ్యాంకు మరియు కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను ప్రకటించిన స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ జాతీయ ర్యాంకులలో ఏపీ తొలిస్ధానంలో నిలిచింది. ఇన్వెస్టర్లు ఈ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి, విశ్వసనీయతకు ఇది నిదర్శనం అంటున్నారు అధికార పార్టీ నేతలు. యూనిట్కు కేవలం రూ. 2.48 పైసల ఖర్చుతో 30 సంవత్సరాల పాటు రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ 10 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టెండర్లను పిలవడం జరగగా.. త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.