వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. ఇవాళ ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయితీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలన్నారు.. అక్కడ నుంచే పని చేసుకునే సదుపాయం ఉంటుందని.. మొదటి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీలను నిర్మించాలని.. ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఆలోగా స్థలాలు గుర్తించి స్వాధీనం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.
మరోవైపు డిసెంబర్ కల్లా డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకున్నట్టు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ను తెలియజేశారు అధికారులు.. తొలివిడతలో భాగంగా 4530 డిజిటల్ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు, కంప్యూటర్ పరికరాలకోసం దాదాపుగా రూ..140 కోట్లకుపైగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక, క్రమంగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్.. కరోనా మహమ్మారితో వర్కింగ్ స్టైల్ మారిపోయి.. అంతా వర్క్ ఫ్రమ్ వైపు అడుగులు వేయగా.. ఆ కాన్సెఫ్ట్ను బలోపేతం చేసే దిశగా చర్యలకు పూనుకుంటున్నారు సీఎం జగన్.