Site icon NTV Telugu

CM Chandrababu : ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేరుస్తున్నాం

Cm Chandrababu

Cm Chandrababu

ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం రాజీ పడబోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో తాము ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలు ఇప్పుడు ‘సూపర్ హిట్’ అయ్యాయని, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ (దీపం-2), అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలను ఎంతో సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ క్రమంలోనే సామాజిక భద్రతా పెన్షన్లను గణనీయంగా పెంచి పేదలకు అండగా నిలిచామని పునరుద్ఘాటించారు.

ఉద్యోగ కల్పన విషయంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఎన్నో న్యాయపరమైన అడ్డంకులు , రాజకీయ కుట్రలు ఎదురైనప్పటికీ మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. అలాగే గృహ నిర్మాణ రంగంలో తమ ప్రభుత్వం సృష్టించిన రికార్డును ప్రస్తావిస్తూ, ఇటీవలే మూడు లక్షల మందికి సామూహిక గృహ ప్రవేశాలు చేయించామని, రాబోయే ఉగాది నాటికి మరో ఐదు లక్షల మందికి సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మూడున్నర ఏళ్ల కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తమ అంతిమ లక్ష్యమని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రకటించారు.

Iran Protests: రక్తసిక్తమైన ఇరాన్! నిరసనల సెగకు 5 వేల మంది బలి..

Exit mobile version