AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ ( సెప్టెంబర్ 18న) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో 15 అంశాల ఎజెండాతో కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఆగస్టు 31వ తేదీలోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అనథరైజ్ గా నిర్మించిన భవనాలకు పినలైజేషన్ విధించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ చట్టాలను సవరిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అలాగే, వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప పురపాలక సంఘంగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965 లకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకునేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం. ఇక, లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థలు ఏర్పాటుకు భూములు కేటాయింపునకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు.
Read Also: Rahul Gandhi: ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఓట్లు తొలగిస్తున్నారు
ఇక, పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కు కన్వర్షన్ కు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ లో ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్లు 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వాహన మిత్ర పథకం కింద ఈ దసరాకు సొంతంగా ఆటో కలిగి నడుపుకునే వారికి 15 వేల రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు తీసుకు వచ్చే పలు బిల్లులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.