YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్

  • చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా?
  • తక్కువ ఆదాయం రావడమే సంపద సృష్టా?
  • కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
Ysjagan

Ysjagan

ఏపీలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పనితీరును మాజీ సీఎం వైఎస్.జగన్ ఎండగట్టారు. సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. గత రెండేళ్ల రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుందంటూ ఫైరయ్యారు. కాగ్ విడుదల చేసిన 2025-26 తాత్కాలిక లెక్కల్లో అసల నిజాలు బహిర్గతమయ్యాయని ధ్వజమెత్తారు. ఒకవైపు 2025-26లో రాష్ట్ర GSDP వృద్ధి రేటు 10.75 శాతం అంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారని.. ​మరోవైపు దానికి పూర్తిగా భిన్నంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3.22 శాతం పడిపోయిన రాష్ట్ర పన్ను రాబడులు.. ​వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు, వినియోగం పెరిగి పన్ను వసూళ్లు ఎక్కువగా ఉండాలి కదా? అని ప్రశ్నించారు.

‘‘కానీ ప్రస్తుత ప్రభుత్వంలో 2025-26 బడ్జెట్ అంచనాల కంటే పన్ను రాబడులు -3.22 శాతానికి క్షీణించాయి. పన్ను రాబడులు నిజంగా 9.60 శాతం పెరిగి ఉంటే.. ప్రభుత్వం చెప్తున్న 10.75 శాతం GSDP వృద్ధిని నమ్మవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో జరిగింది మాత్రం తిరోగమనమే కనిపిస్తుంది. గత ప్రభుత్వ చివరి ఏడాది 2023-24 లో రాష్ట్ర పన్ను రాబడులు రూ. 85,922.23 కోట్లు.. రెండేళ్ల తర్వాత కనీసం 8 శాతం సాధారణ వృద్ధి రేటు ఉన్నా.. 2025-26 నాటికి పన్ను రాబడులు రూ. 1,00,219.69 కోట్లకు చేరాలి.. కానీ 2025-26లో వచ్చిన రాబడి కేవలం రూ. 86,552.68 కోట్లు మాత్రమే..
కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అంచనా ఆదాయ నష్టం అక్షరాలా రూ. 13,667 కోట్లు. చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా? కనీస వృద్ధి కంటే రూ. 13,667 కోట్ల తక్కువ ఆదాయం రావడమే సంపద సృష్టా?.’’ అని నిలదీశారు.

‘‘​మే 2025లో APMDC ద్వారా NCDల జారీతో సేకరించిన రూ. 9,000 కోట్లను ప్రభుత్వం రోజువారీ ఖర్చులకే వాడేసింది. ఈ రూ. 9,000 కోట్ల బాండ్ల నిధులతో ఎలాంటి ఆస్తుల సృష్టి జరగలేదు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ప్రైవేట్ NCD హోల్డర్లకు రాష్ట్ర సంచిత నిధి యాక్సెస్ కల్పించారు. ఈ రూ. 9,000 కోట్ల నిధులను 2025-26 ఖాతాల్లో పన్నేతర ఆదాయంగా చూపించారు.​గత రెండేళ్లుగా పాలనా వర్గాలు, అవినీతి వల్ల స్పష్టమైన ఆర్థిక సంక్షోభం కనిపిస్తోంది. డైవర్షన్ రాజకీయాల కోసమే వేగవంతమైన వృద్ధి అంటూ కట్టుకథలు చెబుతున్నారు. అప్పులు సేకరించడం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులను అవలంబిస్తున్నారు.’’ అని వైఎస్.జగన్ రాసుకొచ్చారు.