YS Jagan: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.. వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలపై చర్చించారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని వారికి లేదు.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వినాలన్న ఆలోచన వారికి లేదన్న జగన్.. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ, మేం అలా చేయలేదు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరూ గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయంగా ఉందన్నారు..
మొన్న ప్రెస్మీట్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, మెడికల్ కాలేజీలు, యూరియా సహా రైతుల కష్టాల మీద మాట్లాడాను.. ఈ మూడింటి గురించి ఆధారాల సహా మాట్లాడ్డానికి కనీసం గంటకుపైనే పట్టింది. ఈ మాత్రం అవకాశం ఇస్తే.. నిశితంగా సభలో చెప్పగలుగుతాం.. లేదు, ఇవ్వం, రెండే రెండు నిమిషాలు ఇస్తామంటే.. ఇక మాట్లాడేది ఏముంటుంది..? అని ప్రశ్నించారు జగన్.. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే సమయం ఇస్తానంటే.. ఇంకేం మాట్లాడగలం అని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలే.. అందులో మూడు పార్టీలు అధికార పార్టీలోనే ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షంలో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నది ఏకైక పార్టీ వైయస్సార్సీపీ మాత్రమే. మిర అలాంటి రాజకీయ పక్షాన్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే.. సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఉంటుంది.. అప్పుడు ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేందుకు అవకాశం వస్తుంది.. కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడంలేదు.. అందుకనే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మేం మాట్లాడుతున్నాం అన్నారు జగన్.
అయితే, మండలిలో మనకు మంచి బలం ఉంది.. మండలిలో మనం ప్రజల తరఫును గొంతు విప్పడానికి అవకాశం ఉంది.. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం అన్నారు వైఎస్ జగన్.. ప్రభుత్వం అన్నది ఉందా? లేదా? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందన్న ఆయన.. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలనూ పట్టించుకోవడంలేదు అని విమర్శించారు.. లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉంది.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు.. అందుకనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ప్రతిచోటా దోపిడీ చేస్తున్నారు. మండలి సభ్యులు పోరాట పటిమ చూపించాలని సూచించారు.. ప్రజలకోసం గట్టిగా పోరాటం చేయాలన్నారు.. అసెంబ్లీలో అధికారపక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోంది.. నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా.. అన్నరీతిలో వారు వ్యవహరిస్తున్నారు. కాగా, ప్రభుత్వం ప్రతి విషయాన్ని రాజకీయంగానే చూస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎలాగూ వారు సమయం ఇవ్వరు కాబట్టి అసెంబ్లీ జరిగే సమయంలో ఆయా అంశాలపై మీడియా ద్వారా ప్రతి అంశంపైన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. నేను కూడా సమ్ అప్ చేస్తూ మీడియాతో మాట్లాడతాను అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
