YS Jagan: అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అద్దంకి గెలవగల నియోజకవర్గమే
అద్దంకి నియోజకవర్గం గెలవలేనిది కాదని స్పష్టం చేశారు వైఎస్ జగన్.. ప్రస్తుత ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. జగన్ అమలు చేసిన పథకాలను రద్దు చేసి, తాను ప్రకటించిన “సూపర్ సిక్స్”, “సూపర్ సెవెన్” హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు.
పునర్విభజనపై జగన్ స్పందన
నియోజకవర్గాల పునర్విభజనను శుభపరిణామంగా అభివర్ణించారు వైఎస్ జగన్… మహిళలకు రిజర్వేషన్లు పెరగడం సంతోషకరమని తెలిపారు. తమ పాలనలోనే మహిళలకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. కొత్త సీట్ల పెరుగుదలతో పార్టీ కార్యకర్తలకు నాయకత్వ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
అప్పులు, సంక్షేమంపై వివరణ
తమ ప్రభుత్వ కాలంలో చేసిన అప్పులపై కూడా జగన్ వివరణ ఇచ్చారు. ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, అందులో రూ.2.72 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్లాయని తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల ఆధారంగా ప్రతి రూపాయి ఎవరికి ఇచ్చామో చెప్పగలమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రెండు సంవత్సరాల లోపే రూ.3.37 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఇక, ప్రస్తుత పాలనలో అవినీతి విస్తృతంగా పెరిగిందని జగన్ ఆరోపించారు. లిక్కర్, ఇసుక, మట్టి, సిలికా, గ్రానైట్ రంగాల్లో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. అమరావతి నిర్మాణాల్లో కూడా భారీ అవినీతి జరుగుతోందని, చదరపు అడుగుకు అధిక ఖర్చులు చూపుతున్నారని పేర్కొన్నారు.
పెట్టుబడులపై క్రెడిట్ దోపిడీ ఆరోపణ
పెట్టుబడుల విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం క్రెడిట్ దోపిడీ చేస్తోందని జగన్ అన్నారు. ArcelorMittal స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులు తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు వాటిని ప్రస్తుత ప్రభుత్వం తమదిగా చూపిస్తోందని విమర్శించారు. అలాగే గూగుల్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని, మొక్కజొన్న, శెనగ, అరటి, టమోటా వంటి పంటలకు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం కావడంతో విద్యార్థులు చదువులు మానేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిందని పేర్కొన్నారు.
కార్యకర్తలకు భరోసా
“జగన్ 2.0”లో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు జగన్. పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యకర్తల ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మొత్తంగా, అద్దంకి సమావేశంలో జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై సంకేతాలు ఇచ్చారు.