Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హోం మంత్రి కాదని, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని పేర్కొంటూనే, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేరస్తులను కుల కోణంలో చూడకూడదని, క్రిమినల్స్కు కులం ఉండదని స్పష్టం చేశారు.. అయితే, నేను హోం మినిస్టర్ కాకపోవడం.. లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేకపోవడం క్రిమినల్స్ అదృష్టమని పేర్కొన్నారు..
‘గుండాలకు గట్టిగా సమాధానం చెబుతాం’
గత రెండేళ్లుగా సహనంగా వ్యవహరించానని చెప్పిన పవన్ కల్యాణ్, ఇకపై గుండాలు, నేరగాళ్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తానని హెచ్చరించారు. ఒక తల్లి తన బిడ్డ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధితుల హక్కులను కూడా గుర్తించాలని అన్నారు. ప్రతి సంఘటనకు కులాన్ని ముడిపెట్టడం సరైన విధానం కాదని పవన్ విమర్శించారు. సమాజాన్ని విభజించే కుల రాజకీయాలు రాష్ట్రానికి హానికరమని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కుల గొడవలను ప్రోత్సహించలేదని, తనను కుల చట్రంలో బంధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అధికారులపై ప్రత్యేక దృష్టి
వైసీపీ పట్ల విధేయత చూపుతున్న అధికారులపై ప్రత్యేక దృష్టి పెడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇప్పటి వరకు కొన్ని అంశాల్లో మౌనం పాటించానని, ఇకపై ప్రజల ముందే తన అభిప్రాయాలను వెల్లడిస్తానని తెలిపారు. మరోవైపు.. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరింత చురుకుగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ప్రతి సమస్యకు తాను వ్యక్తిగతంగా వెళ్లడం సాధ్యం కాదని, ప్రజా సమస్యలపై పార్టీ ప్రజాప్రతినిధులు ముందుండాలని పిలుపునిచ్చారు.
తప్పుడు అట్రాసిటీ కేసులపై ఆందోళన
తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నిరోధించాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. కొన్ని కేసుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, సుగాలి ప్రీతి, వైఎస్ వివేకానంద రెడ్డి కేసులను ప్రస్తావించారు.. లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి.. రూల్ ఆఫ్ లా బలంగా నిలబెట్టాలి.. కులాలకు.. మతాలకు వాట్సాప్ గ్రూపులు ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ కి ఎందుకు ఉండవు? అని ప్రశ్నించారు.. సమాజాన్ని బలహీనపరచడానికి రాలేదు.. గుండాల తొక్కి నార తీస్తా.. రెండేళ్లుగా చాలా సహనంగా ఉన్నాను అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

