Pawan Kalyan: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తూ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏర్పాటు చేసిన 28 మంది సభ్యులతో కూడిన కమిటీలతో విడివిడిగా సమావేశమైన ఆయన, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ నాయకుడిని పరిశీలకుడిగా, కేంద్ర కార్యాలయం నుంచి ఐదుగురు సభ్యులను పర్యవేక్షణ కోసం నియమించినట్లు తెలిపారు పవన్… సోమవారం నుంచి కమిటీ సభ్యులు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, పార్టీ సభ్యుల నుంచి అభిప్రాయాలు, వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూడా పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. విధానపరమైన చర్చలకు బదులుగా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అవసరమైనప్పుడు ధీటుగా సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. తాము మౌనంగా ఉంటే దానిని బలహీనతగా భావించవద్దని, అవసరమైతే గట్టిగా స్పందిస్తామని అన్నారు.
తాను ఒకే కులానికి పరిమితమైన నాయకుడినైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి నాయకులు జనసేనలో ఎందుకు చేరతారని ప్రశ్నించిన పవన్ కల్యాణ్, జనసేన అన్ని వర్గాల కోసం పనిచేసే పార్టీ అని పేర్కొన్నారు. అలాగే పంతం నానాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ, అసభ్య భాషను తాము ప్రోత్సహించబోమని, అయితే గతంలో వైసీపీ నేతలు ఉపయోగించిన భాషను కూడా ప్రజలు గుర్తుంచుకున్నారని అన్నారు. ఇక, యువత ఉచితాల కంటే భవిష్యత్తును కోరుకుంటోందని పేర్కొన్న పవన్ కల్యాణ్, హుద్హుద్ తుఫాన్ సమయంలో ఓ యువకుడు “25 కేజీల బియ్యం కాదు.. 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి” అని చెప్పిన మాటలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా జనసేన పని చేస్తుందని స్పష్టం చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

