Pawan Kalyan: ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. గురువారం రాత్రి విజయవాడలో పార్టీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై పవన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ “పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా ముందుకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో ప్రజలతో… అదే సమయంలో జనసేన శ్రేణులతో మరింతగా మమేకం కావడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.

పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో బలంగా నిలబడ్డ ప్రతి వీర మహిళకి, జన సైనికుడికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు పవన్‌ కల్యాణ్‌.. వారి సాధక బాధకాలు తెలుసుకొని భరోసా ఇవ్వాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కార్యక్రమాల నిర్వహణ షెడ్యూల్ ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అనుసరించాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను ఎప్పటికప్పుడు తెలియచేయాలి” అన్నారు. ఈ సందర్భంగా జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణకు పార్లమెంట్ నియోజక వర్గాలకు పరిశీలకులుగా వెళ్లిన ప్రజా ప్రతినిధులు తమ అనుభవాలను వివరించారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న పార్లమెంట్ నియోజక వర్గాల పరిశీలకులు, కమిటీ సభ్యులకు పవన్ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, లింగమనేని రమేష్, ఎమ్మెల్సీలు నాగబాబు, పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.