NTV Telugu Site icon

TDP: నేడు టీడీపీ గూటికి వైసీపీ మాజీ ఎంపీలు..

Tdp

Tdp

TDP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా వైసీపీకి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. పార్టీకి రాజీనామా చేసి.. కొందరు టీడీపీ.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీ ఇలా వరుసగా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇప్పటికే రాజీనామా చేసిన సీనియర్‌ నేత మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు టీడీపీ గూటికి చేరనున్నారు.. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇక, ఈ ఇద్దరు మాజీ ఎంపీల వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా టీడీపీ కండువాకప్పుకుంటారని తెలుస్తోంది..

Read Also: Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివేనా? మరి ఏ రకమైన వాటిని తినడం మంచిది?

కాగా, ఇప్పటికే రాజ్యసభ పదవులకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన విషయం విదితమే.. తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు.. బీద మస్తాన్‌ రావుకు మరో నాలుగేళ్లు, మోపిదేవికి రెండేళ్లు సభ్యత్వం మిగిలి ఉండగానే.. రాజీనామా చేయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఇక, తమ రాజీనామా వెనుక ఎటువంటి ప్రలోభాలు లేవని, స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని చెప్పిన నేతలు.. ఇప్పటి వరకు పార్టీలో గౌరవం అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మస్తాన్‌రావు.. గతంలో చంద్రబాబు తమ బాస్ అని.. మళ్లీ అవకాశం వస్తే రాజ్యసభకు వస్తానని రాజీనామా చేసిన సందర్భంగా పేర్కొన్న విషయం విదితమే.. మరోవైపు.. తాను టీడీపీలో చేరనున్నట్టు.. అందులో దాచాల్సిన విషయం ఏమీ లేదని.. రాజీనామా చేసిన సందర్భంగా మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు.. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమేనని.. వైఎస్‌ జగన్ తనకు వైసీపీలో 100 శాతం సహకరించారని.. అయితే, కొన్ని సందర్భాలు, అంశాల్లో విభేదాలు వచ్చాయి.. కాబట్టి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చి రాజీనామా చేసినట్టు మోపిదేవి పేర్కొన్న విషయం విదితమే.. ఇక, ఈ రోజు ఇద్దరు మాజీ ఎంపీలో టీడీపీలో చేరనుండగా.. మరికొందరు నేతలు త్వరలోనే పసుపు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.. సైకిల్ పార్టీతో వైసీపీ నేతలు పలువురు టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది..