CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి

Chandrababu2

Chandrababu2

CM Chandrababu: అమరావతిలో ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకత్వం, ప్రజా ప్రతినిధుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ప్రజల్లో పార్టీపై విశ్వాసం మరింత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా కాకుండా జట్టుగా పనిచేసే సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. కొంతమంది నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తాజా సర్వేల్లో వెల్లడైందని చంద్రబాబు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని పార్టీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, సర్వేల్లో ప్రతికూలంగా ఉన్న నేతలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే, వారి వ్యక్తిగత వ్యవహారాల వల్ల పార్టీకి నష్టం జరిగే పరిస్థితిని మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

కొంతమంది అధికారుల పనితీరులో కూడా లోపాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. అలాంటి అధికారులను కూడా గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 1999 ఎన్నికలను ప్రస్తావించిన చంద్రబాబు, అప్పట్లో పార్టీకి నష్టం కలిగించే కొంతమంది నేతలను పక్కన పెట్టడం వల్లే విజయం సాధించగలిగామని గుర్తు చేశారు. పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన సంకేతాలిచ్చారు.

సమావేశంలో కొందరు ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారని, పార్టీ ప్రయోజనాల కోసం సూచనలు చేస్తే కొందరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లి వ్యాఖ్యలు చేస్తున్నారని ఓ ఎంపీ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, ఇలాంటి పరిస్థితులు రాజకీయాల్లో సహజమేనని అన్నారు. తనను కూడా విమర్శించే వారు ఉంటారని, అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోకుండా పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేయాలని నాయకులకు సూచించారు.