AP Women’s Commission Notice: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ మేరకు జూన్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని అమర్నాథ్ను ఆదేశించింది. తన వ్యాఖ్యలకు సంబంధించిన వివరణతో పాటు, వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించాలని కమిషన్ సూచించింది. అదేవిధంగా, నిర్ణీత గడువులోగా స్పందించకపోతే అందుబాటులో ఉన్న మహిళల ఫిర్యాదులు, వీడియో క్లిప్పింగ్స్ మరియు ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ హెచ్చరించింది.
హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్న అభిప్రాయంతో కమిషన్ ఈ అంశాన్ని స్వయంగా పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం విదితమే.. రాజకీయ ప్రత్యర్థులపై వ్యాఖ్యలు చేసే ముందు తన బాధ్యతలను గుర్తుంచుకోవాలని సూచిస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అనితను ఉద్దేశించి అమర్నాథ్ “మేకప్ మంత్రి” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఎండలో తిరిగితే కేజీల కొద్దీ మేకప్ పడుతుందని, ఆ మేకప్తో గోడలకు పుట్టీ కూడా పెట్టుకోవచ్చంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే అవి ఎక్కడ వస్తున్నాయో హోంమంత్రి ప్రజలకు వివరించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తాము చేసే రాజకీయ పోరాటం వేరని, అధికారంలో ఉండి చేసే వ్యవహారాలు తమకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
ఇక, అనితపై చేసిన వ్యాఖ్యల వివాదంపై ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్ స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు మాత్రమే ప్రతిస్పందించానని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే తాను స్పందించానన్నారు. తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని, హోంమంత్రి అనిత మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేస్తే.. తన స్పందన కూడా అలాగే ఉంటుందని హెచ్చరించారు. టీడీపీ ఫేక్ ఉద్యమాన్ని నడుపుతోందని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. తాను చేసిన వ్యాఖ్యలను మహిళా లోకానికి, దళిత సమాజానికి ముడిపెట్టడం పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. జూన్ 12న తాను మాట్లాడితే, మూడు రోజుల తర్వాత టీడీపీ నాయకత్వానికి ఒక్కసారిగా బాధ కలిగిందని ఎద్దేవా చేశారు. మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను ప్రజలే తప్పుబట్టారని అన్నారు. అయితే, ఈ వ్యవహారంలో ఇప్పుడు గుడివాడకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం చర్చగా మారింది..

