Tirumala Parakamani Case: సంచలనంగా మారిన తిరుమల పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, సంబంధిత విభాగాలకు అనుసరించాల్సిన సూచనలను కూడా కోర్టు స్పష్టంగా తెలియజేసింది. చోరీ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ, ఏసీబీ డీజీలకు హైకోర్టు పూర్తి వెసులుబాటు కల్పించింది.. కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది.
Read Also: Dandruff Remedies: డ్యాండ్రఫ్ జాడ మాయం చేసే 5 నేచురల్ టిప్స్ ఇవే..
ఈ కేసు ఒక దశలో లోక్ అదాలత్లో రాజీ వివాదం జరిగినప్పటికీ, అది దర్యాప్తులో అడ్డంకిగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. కేసు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడానికి రవికుమార్ ఆస్తులపై విచారణను కొనసాగించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దర్యాప్తు సమర్థవంతంగా సాగేందుకు ఇరు సంస్థలు సేకరించిన ఆధారాలు, సమాచారం, వివరాలను పరస్పరం పంచుకోవాలని హైకోర్టు సూచించింది. ఇది కేసు నిజానిజాలు వెలికితీయడంలో కీలకంగా ఉంటుందని కోర్టు పేర్కొంది.
కోర్టు మరో కీలక నిర్ణయంగా, అప్పటి టీటీడీ CVSO వై. సతీష్కుమార్ పోస్టుమార్టం సర్టిఫికేట్ను సీల్డ్ కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్కు అందజేయాలని సీఐడీకి ఆదేశించింది. ఈ రిపోర్ట్ కేసు దర్యాప్తులో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు సూచనలు ఉన్నాయి. ఇక, దర్యాప్తు సమయంలో అవసరమైతే సేకరించిన సమాచారం, ఆధారాలను ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department), ఈడీ (Enforcement Directorate) తో పంచుకోవచ్చని కోర్టు స్పష్టంచేసింది. ఈ చర్య ద్వారా ఆర్థిక అక్రమాలపై మరింతగా వెలుగు పడే అవకాశం ఉంది. సీఐడీ మరియు ఏసీబీ డీజీలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. విచారణలో తదుపరి చర్యల దిశగా ఇది ముఖ్యమైన మలుపు అని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసుపై హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికి మరిన్ని నివేదికలు, ఆధారాలు సమర్పించాల్సి ఉండొచ్చు.