CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..

Chandrababu

Chandrababu

CM Chandrababu: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర లక్ష్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. నరసన్నపేటకు రావడం తనకు కొత్తకాదని, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం మరింత పని చేయాలనే ప్రేరణ ఇస్తోందన్నారు. అయితే పేదరికం లేని సమాజాన్ని చూడటం తన జీవిత ఆశయమని చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గి ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరగాలన్నదే తన ఆలోచన అని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల పెద్ద సమస్యగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోవడంతో వృద్ధుల సంఖ్య పెరిగి ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం తానే పనిచేశానని, కానీ ఇప్పుడు “పిల్లలే సంపద” అనే భావనను ప్రజల్లో తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు.. జనాభా పెరుగుదల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని చంద్రబాబు వెల్లడించారు. మూడో బిడ్డ పుడితే రూ.30 వేల ప్రోత్సాహకం, నాలుగో బిడ్డకు రూ.40 వేల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. పిల్లలను భారంగా కాకుండా సంపదగా భావించే పరిస్థితి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇక, అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, “తల్లికి వందనం” పథకం కింద పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. భగవంతుడు కరుణిస్తే ఈ మొత్తాన్ని ఇంకా పెంచే బాధ్యత కూడా తీసుకుంటామని వ్యాఖ్యానించారు.

భూ వివాదాలకు చెక్.. 2027 నాటికి పూర్తి పరిష్కారం
గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలు, భూ సమస్యలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు… ప్రజల ఆస్తులను మార్చేశారని ఆరోపించారు. భవిష్యత్తులో భూ వివాదాలు లేకుండా పగడ్బందీగా సర్వే నిర్వహిస్తున్నామని, 2027 మార్చి నాటికి భూతగాదాలన్నింటికీ పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర అంటే కేవలం రోడ్లపై చెత్త లేకుండా చూడటమే కాదని, మన ఆలోచనలు, ఆరోగ్యం, జీవనశైలి కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు. ఇళ్ల నుంచి కార్యాలయాల వరకు ప్రతి పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రస్తుతం మూడు లక్షలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని 54 లక్షలకు పెంచడమే తమ టార్గెట్ అని వెల్లడించారు.

“P4 మోడల్‌తో ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం”
గతంలో P3 విధానంతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని గుర్తుచేసిన చంద్రబాబు, ఇప్పుడు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు “P4” అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ధనవంతులు పేదలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. సమాజంలో పై 10 శాతం మంది కింది 20 శాతం ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఇక, 2019 నుంచి 2024 మధ్యకాలాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చంద్రబాబు విమర్శించారు. అప్పటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు 23 నెలలు పట్టిందన్నారు. ఇప్పటివరకు 121 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను క్లియర్ చేశామని, జూన్ నాటికి చెత్తలేని సమాజం నిర్మించడమే లక్ష్యమని చెప్పారు.

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి
రాష్ట్రవ్యాప్తంగా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఆరు ప్లాంట్లు పనిచేస్తున్నాయని, త్వరలో మరో రెండు ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. చెత్త నుంచి కాంపోస్ట్ లేదా ఎనర్జీ తయారవ్వాలని, వ్యర్థాలను సంపదగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..