AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మూడున్నర గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో.. 50కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. ఎస్ఐపీబీ, సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు..
అయితే, ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇద్దరు మంత్రులు.. అంటే పవన్ కల్యాణ్ సహా ముగ్గురు మంత్రులు డుమ్మా కొట్టారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్ కల్యాణ్.. స్వల్ప అనారోగ్యం కారణంగా కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండగా.. రేపు సీఎం చంద్రబాబు నాయుడు వెలిగొండ పర్యటన ఉండడంతో.. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఉన్న మంత్రి గొట్టిపాటి రవి కూడా కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు.. ఇక, కేరళ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా మంత్రి వర్గ సమావేశానికి రాలేక పోయారు.. ఇలా మొత్తంగా ఈ రోజు కేబినెట్ సమావేశానికి ముగ్గురు మంత్రులు దూరంగా ఉన్నారు..
ఇక, పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.. రాజమండ్రి, చీరాల, సత్యసాయి జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది కేబినెట్.. సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.. ఉన్నతవిద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్ సమావేశం.