మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ముస్తాబైంది. ఇవాళ్టి నుంచి 21 వరకు సాగే ఉత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. ఇటు భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ వాహనాల దారి మళ్లించినట్టు తెలిపారు ఎస్పీ రఘువీర్ రెడ్డి. ఈ నెల 17నుండి 19 వరకు విజయవాడకు వెళ్లవలసిన భారీ వాహనాల కర్నూలు సిటీ లోని నంద్యాల చెక్ పోస్ట్, ఆత్మకూరు , దోర్నాల , విజయవాడ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేశామన్నారు ఎస్పీ రఘువీర్ రెడ్డి.
Read Also: Off The Record: దెబ్బకు దెయ్యం వదిలిందా?
భారీ వాహనదారులు కర్నూలు లోని నంద్యాల చెక్ పోస్ట్ నుండి నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడకు వెళ్ళాల్సి ఉంటుందన్నారు ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. నేటి నుంచి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వాంగసుందరంగా తీర్చి దిద్దారు. దేవతా మూర్తుల విగ్రహాలకు కొత్త హంగులు అద్దారు.
ఉత్సవాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి రానుండడంతో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తోంది దేవస్థానం. స్వామి దర్శనానికి భక్తులు ఐదురోజుల ముందు నుంచే పాదయాత్ర ప్రారంభించి శ్రీశైలం చేరుకుంటారు. ఇక్కడికి 10 కిలోమీటర్లు దూరంలోని కైలాస ద్వారం మెట్ల మార్గంలోని వచ్చే భక్తుల కోసం భారీ షెడ్లు నిర్మిస్తున్నారు. ఇవాళ యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం అవుతాయి. సాయంత్రం ధజారోహణ ఘట్టం ఉంటుంది. రేపటి నుంచి వరుసగా భృంగి, హంస, మయూర, రావణ, పుష్పపల్లకీ, గజ, వాహనసేవలు ఉంటాయి.
18 వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా ప్రభల ఉత్సవం, నంది వాహనసేవ, రుద్రాభిషేకం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు. 19వ తేదీన అమ్మవారి రధోత్సవం, తెప్పోత్సవం ఉంటాయి. 21వ తేదీతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు అధికారులు. మరోవైపు నేటి నుంచి రద్దీ బాగా పెరగనుండడంతో ఇటు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.
Revanth Reddy : ఇల్లందు గడ్డ కాంగ్రెస్ అడ్డా.. కేసీఆర్ను నమ్మితే మునిగినట్లే