2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను చెల్లింపుపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగర పాలక, నగర పంచాయతీలలో ఆస్తి పన్నును ఏప్రిల్ నెలాఖరులోగా చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు మొత్తం తమ ఆస్తి పన్నును ఒకే సారి చెల్లిస్తేనే ఈ రాయితీ వర్తిస్తుందని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇంటి, నీటి పన్నును వసూలు చేస్తోంది. పాత బకాయిలను మార్చి నెలాఖరులోగా చెల్లించాలని సూచనలు చేసింది. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా అధికారులు పన్ను వసూలు మొదలు పెట్టారు. కొన్ని చోట్ల దీనిపై తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో పన్నుల చెల్లించకపోతే సామాన్లు జప్తు చేస్తామని వాహనాలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. అలాగే పన్ను కట్టకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని అధికారులు ఆటోలో ప్రచారం చేశారు.