ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విదేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ నమోదు అవుతుండటంతో ఇప్పటికే అంతర్జాతీయ విమానాలపై అధికారులు నిషేధం విధించారు. అయితే డిసెంబర్ 1 తర్వాత కేవలం 10 రోజుల వ్యవధిలో ఏపీకి 12,500 మంది విదేశీయులు రావడంతో ప్రజల్లో ఒమిక్రాన్ వైరస్ భయాందోళనలు ప్రారంభమయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో అత్యధికంగా విశాఖ జిల్లా వారే ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
Read Also: కరోనా అంతంపై బిల్గేట్స్ సంచలన వ్యాఖ్యలు
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు 9వేల మంది అడ్రస్లను అధికారులు సేకరించారు. మిగతా వారి కోసం సంప్రదించగా వారి నుండి ఎలాంటి స్పందన రావడం లేదు. ఫోను స్విచ్ ఆఫ్ చేయడంతో వారి వివరాలను అధికారులు స్వీకరించలేకపోతున్నారు. అటు 9 వేల మందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా.. వారి రక్త నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. ఏపీకి వచ్చిన 12,500 మంది విదేశీయుల్లో విశాఖ జిల్లాకు చెందిన వారే 1,700 మంది ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి కరోనా పరీక్షలు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.