నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లీక్ సూత్రధారి రాజేష్ సహా 11 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల గురించి జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎగ్జామినేషన్ డ్యూటీకి హాజరై మాల్ప్రాక్టీస్కు పాల్పడిన ప్రధాన వ్యక్తి టి.రాజేష్ అని తెలిపారు. పేపర్ లీకేజీ సమాచారం వచ్చిన వెంటనే తహసీల్దార్ ఆధ్వర్యంలో డీఈవో, పోలీస్ అధికారులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
పరీక్ష ప్రారంభమైన తర్వాత రాజేష్ తన మొబైల్తో ఫోటోలు తీసి సమాధానాల కోసం బయట వేచి ఉన్న 9 మంది తెలుగు టీచర్లకు పోస్ట్ చేశాడని.. మాల్ ప్రాక్టీస్ చేసిన రాజేష్తో పాటు 11 మంది టీచర్లను కూడా అరెస్ట్ చేశామని కలెక్టర్ వెల్లడించారు. వీరిలో తెలుగు టీచర్లు నీలకంఠేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మీ దుర్గ, ఆర్యభట్టు, పోతునూరు, రంగనాయకులు ఉన్నారన్నారు. పరీక్ష కేంద్రంలో ఇలాంటి సంఘటన జరుగుతున్నా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్టుమెంటల్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్కు చెందిన నలుగురిని సస్పెండ్ చేసినట్లు వివరించారు. కాగా అరెస్ట్ చేసిన వారిని గురువారం ఉదయం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
AP Tenth Paper Leak: నంద్యాలలోనూ పేపర్ లీక్ కలకలం.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్