ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని గుర్తుచేశారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సమృద్ధిగా సహజ వనరులను రాష్ట్రం కలిగి ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత పొట్టి శ్రీరాములును స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు.

రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య శైలి భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనదని గవర్నర్ పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తీరుగానే తెలుగు భాష ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని కలిగి ఉండి అద్భుతమైన నాణ్యతకు ప్రసిద్ధి చెందిందన్నారు.
‘రాష్ట్ర ప్రభుత్వం.. అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది..అయితే ఆ సంక్షేమఫలాలు అర్హులైన ప్రతి వ్యక్తికి అందేలా చూడాలి’ అని గవర్నర్ అన్నారు. ప్రభుత్వ విజయానికి ప్రజల సంతోషమే కొలమానమని.. పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్షణంగా ఉండాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
సామాన్య ప్రజల కలలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలల్లో మరింత విజయాన్ని సాధించాలని బిశ్వభూషణ్ హరిచందన్ అకాంక్షించారు. అంతకుముందు గవర్నర్ సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ సేవల్ని కొనియాడారు. దేశ సమగ్రతకు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అందించిన సేవలు మరువలేనివని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
పటేల్ 146వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్ నివాళుర్పించారు. దేశ సమైక్యత కోసం పటేల్ అనిర్విరామంగా కృషి చేశారన్నారు. దేశ ప్రజల హృదయాల్లో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. దేశం కోసం ఆయన పడ్డ తపన ఈ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.