భారత గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పుడు మునుపు ఎన్నడూ లేని విధంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు దేశంలో జరిగిన 49 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 39 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, సార్వత్రిక ఎన్నికలలో కూడా హస్తం పార్టీ ప్రదర్శన అధ్వాన్నంగా ఉంది. 2014లో 44 సీట్లు, 2019లో 52 స్థానాలు మాత్రమే గెలవటం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం.
దేశంలోని మొత్తం 545 లోక్సభ స్థానాలలో దాదాపు 200 చోట్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖా ముఖి పోరు ఉంటుంది. ఈ స్థానాలలో కాంగ్రెస్ను బీజేపీ సునాయాసంగా ఓడించగలుగుతోంది. బీజేపీని ధీటుగా ఎదుర్కోవటంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమవుతోంది. కారణాలను విశ్లేషించుకుని పార్టీ తిరిగి పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల వేళ మాత్రమే హడావుడి చేస్తుంది. మిగతా సమయంలో గాంధీలు అటువైపు చూడదు. బీజేపీ విషయం అలా కాదు. నాయకత్వం నిరంతరం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటుంది. ఎన్నికలకు చాలా కాలం ముందే వ్యూహ రచన చేసి దానిని అమలుచేసే పనిలో ఉంటుంది. గెలవటానికి ఏం చేయాలో అది చేస్తుంది. అందుకే బీజేపీ ముందు కాంగ్రెస్ తేలిపోతోంది.
పార్టీ బలహీనమయ్యే కొద్దీ అసమ్మతి స్వరం పెరగుతోంది. నిన్న మొన్నటి వరకు సోనియా దయతో అధికార పదువులు అనుభవింని వారు ఇప్పుడు ఆమె పట్ల ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. గాంధీల ప్రజాకర్షణ శక్తి తగ్గితే తగ్గ వచ్చు .కానీ ఇప్పటికీ ఆ పార్టీ ముక్కలు కాకుండా ఈ మాత్రమైనా ఒక్కటిగా ఉందంటే గాంధీలే కారణం. అయితే అసమ్మతి నేతల వాదనను కూడా కొట్టిపారేయలేం.
2019 నుంచి పార్టీ అధ్యక్ష పోస్ట్ ఖాలీగా ఉంది. సోనియాతాత్కాలిక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. కానీ, నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు. ఆయన ఏ హోదాలో పార్టీ అత్యున్నత నిర్ణయాలు తీసుకుంటున్నారని కపిల్ సిబల్ వంటి వారుప్రశ్నిస్తున్నారు. పార్టీలో సంస్కరణల కోసం వారు డిమాండ్ చేస్తున్నారు. ఐతే, అధినేత్రి వారి డిమాండ్లను పట్టించుకోలేదు. కానీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవంతో సోనియా తీరు మారింది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె సీనియర్లు చెప్పేది కూడా వింటున్నారు. ఎలాగూ వచ్చే ఆగస్టులో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ నూతన అధ్యక్షడు ఎవరో మారో నాలుగు నెలలలో తేలిపోతుంది.
ఇదిలావుంటే.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో శనివారం పార్టీ సీనియర్ నేతలు సమావేశమై నాలుగు గంటల పాటు చర్చించారు. రాహుల్గాంధీతో పాటు అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, మల్లిఖార్జున ఖర్గే, అజయ్ మాకెన్, కె.సి.వేణుగోపాల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఈ సామావేశానికి హాజరవటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రశాంత్ కిశోర్ ఈ భేటీ సందర్భంగా 2024 ఎన్నికల వ్యూహంపై సోనియాకు విఫులంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. సీనియర్ నేతల బృందం దానిని పరిశీలించి వారం రోజుల్లో పార్టీ అధ్యక్షురాలికి నివేదిక సమర్పించనుంది. తరువాత సోనియా తుది నిర్ణయం తీసుకుంటారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముందుకు వెళ్లాల్సిన విధానంపై ఈ భేటీ జరిగిందని కిశోర్ సన్నిహిత వర్గాలు అంటున్నారు.
మరోవైపు, పార్టీలో సీనియర్ నేతలను అసంతృప్తికి గురిచేయకుండా మార్పులు తీసుకురావాలని గాంధీలు భావిస్తున్నారు. ఐతే, ప్రశాంత్ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు. ఇంతకీ ఆయన పార్టీలో చేరతారా, సలహాదారుగా ఉంటారా అనేది కూడా తెలియాల్సి వుంది. ఆయన కేవలం ఎన్నికల కన్సల్టెంట్ మాత్రమే కాదు 2018-20 మధ్య జనతా దళ్ (యూ) నేతగా ప్రత్యక్ష రాజకీయాలో క్రియాశీలంగా వ్యవహరించారు. సొంత పార్టీ కూడా పెడతారనే ఊహాగానాలు కూడా వనిపించాయి.
జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాగల సత్తా ఇప్పటికీ కాంగ్రెస్కు మాత్రమే ఉందని పీకే బలంగా నమ్ముతారు. రాత్రికి రాత్రి కాంగ్రెస్ కథ మారకపోవచ్చు…కొంత సమయం పట్టినా బీజేపీ గద్దె దించే శక్తి హస్తం పార్టీకే ఉందంటారాయన.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మోడీ, షా ఇలాఖా గుజరాత్ పై కాంగ్రెస్ గురిపెట్టినట్టు తెలుస్తోంది. అందుకు ప్రశాంత్ కిశోర్ సేవలను పూర్తిగా వినియోగించుకోనుంది. ప్రస్తుతం కాంగ్రెస్కు పోటీగా గుజరాత్ లో ఆప్ పాగా వేసే ప్రయత్నంలో ఉంది. ఆ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్, యువనేత హార్దిక్ పటేల్ను తమ వైపు తిప్పుకోవాలని ఆప్ ప్రయత్నిస్తోంది. ఆయన రాష్ట్రంలో బలమైన పటీదార్ సామాజికవర్గానికి చెందినవారు.
హార్దిక్ పటేల్తో పాటు రాష్ట్రానికి చెందిన దళిత నేత జిగ్నేష్ మేవాని వంటి యువనేతలు గుజరాత్ కాంగ్రెస్లో ఉన్నారు. 2017 ఎన్నికలలో బీజేపీ 99 సీట్లు సాధించగా కాంగ్రెస్ కు 77 స్థానాలు వచ్చాయి. బీజేపీకి 49 శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్కు 41 శాతం ఓట్లు వచ్చాయి. తేడా స్వల్పంగానే ఉంది. పైగా రాష్ట్రంలో బీజేపీ దాదాపు మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రజలు మార్పు కోరుకునే అవకాశం ఉండొచ్చు. కనుక ఈ ఏడాది జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది.
గత ఏడాది కాంగ్రెస్ అధిష్ఠానం, ప్రశాంత్ కిశోర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత కిశోర్ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత.. మరోసారి వారు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. పార్టీలో కీలకంగా వ్యవహరించాలని ప్రశాంత్ కోరుకుంటున్నారు.
పీకే పార్టీలోకి రావటం పట్ల కొందరు సీనియర్లు అయిష్టత ప్రదర్శించవచ్చు. అందుకే పీకే వ్యవహార శైలి సీనియర్లు ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని అధిష్టానం భావిస్తోంది. మరి అందుకు ఆయన అంగీకరిస్తారో లేదో తెలియదు. కానీ స్వేచ్చ ఇస్తే కాంగ్రెస్ రాత మారే అవకాశం ఉందనటంలో సందేహం లేదు. దాంతో, బీజేపీకి కాంగ్రెస్ ఇక ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదనే వారి నోళ్లు మూతపడవచ్చు.